గ్రామం నుంచి జిల్లా వరకు సమగ్ర ఆర్థిక ప్రణాళికతో వేగవంతమైన అభివృద్ధి సాధ్యం
1 min read
శాస్త్రీయ మైక్రో ప్లానింగ్తో అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు శాస్త్రీయమైన సూక్ష్మ ప్రణాళిక (మైక్రో ప్లానింగ్) ఆధారంగా సమగ్ర ఆర్థిక నివేదికలను రూపొందించి, అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే జిల్లా అభివృద్ధి వేగవంతమవుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (హెచ్ఆర్డీ)లో జిల్లా అధికారుల కోసం నిర్వహించిన సామర్థ్య వృద్ధి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్ బి. గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో సీపీఓ ప్రకాశ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, శిక్షణాధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, సహజ వనరులు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సూచీలు, ఆదాయ వనరులు, అభివృద్ధి అవకాశాలు, సవాళ్లపై ప్రతి శాఖకు సమగ్ర అవగాహన ఉండాలని సూచించారు. శాస్త్రీయ ప్రణాళికతో ముందుకు సాగితే జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఫీడ్బ్యాక్ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రస్తుత పరిస్థితి, అందుబాటులో ఉన్న వనరులు, అభివృద్ధి అవకాశాలు, సమస్యలు, సవాళ్లపై సమగ్రంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిపారు. సమష్టి కృషితో జిల్లాను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇటువంటి సామర్థ్య వృద్ధి కార్యక్రమాలు కీలకంగా నిలుస్తాయని అన్నారు.అనంతరం నిపుణుల బృందం ‘స్వర్ణాంధ్ర విజన్’, జిల్లా అభివృద్ధి లక్ష్యాలు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) భావన, ఆర్థికాభివృద్ధి సూచీలు, జిల్లా స్థాయిలో జీడీపీ అంచనా విధానం, రంగాల వారీ ఆర్థిక వృద్ధి విశ్లేషణ, మైక్రో ప్లానింగ్ విధానంపై అధికారులకు దశల వారీగా శిక్షణ నిచ్చారు.


