బండారి మమత ఉన్నత విద్యకు అండగా నిలిచిన హొళగుంద ఎస్ఐ
1 min read
హోళగుందన్యూస్ నేడు: ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలోనే ఆగిపోతుందేమోనని ఆందోళన చెందిన ఓ నిరుపేద విద్యార్థినికి ప్రజాప్రతినిధులు, సేవా సంస్థలు, పోలీసు అధికారులు అండగా నిలిచి ఆమె ఉన్నత విద్యకు మార్గం సుగమం చేసిన సంఘటన హొళగుంద మండలంలో ఆదర్శంగా నిలిచింది.కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలానికి చెందిన బండారి మమత నిరుపేద కుటుంబంలో జన్మించింది. కుటుంబంలో నలుగురు కుమార్తెలు ఉండగా మమత రెండో కుమార్తె. కుటుంబ పోషణ కోసం ఆమె తల్లిదండ్రులు వలస వెళ్లి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మమత చదువు కొనసాగించడం కష్టసాధ్యంగా మారింది.మమత పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు స్పందించి, ఆర్డీటీ (RDT) సంస్థ ప్రతినిధులతో చర్చించి ఆమెకు రూ.40 వేల సెమీ స్కాలర్షిప్ మంజూరు అయ్యేలా సహకరించారు. దీంతో మమత విద్యాభ్యాసానికి తొలి అడుగు పడింది.అలాగే మమత పరిస్థితిని తెలుసుకున్న హొళగుంద ఎస్ఐ గురజాల దిలీప్ కుమార్ మానవత్వంతో స్పందించి, ఆమె ఉన్నత విద్య కోసం వ్యక్తిగతంగా రూ.22 వేల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా మిగిలిన ఫీజు, సీటు తదితర అంశాలపై కర్నూలులోని శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంతో మాట్లాడి మమత చదువు నిరాటంకంగా కొనసాగేందుకు ప్రత్యేక చొరవ చూపారు.పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం సమాజానికి స్ఫూర్తిదాయకమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే తన లక్ష్యానికి అండగా నిలిచిన వారందరికీ మమత కృతజ్ఞతలు తెలియజేసింది.ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, హొళగుంద ఎస్ఐ గురజాల దిలీప్ కుమార్, ఆర్డీటీ సంస్థ ప్రతినిధులు, శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యానికి బండారి మమత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.“పేదరికం చదువుకు అడ్డంకి కాదు. ప్రతిభకు సమాజం అండగా నిలిస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటాను” అని మమత పేర్కొంది.

