సీఎం చంద్రబాబు పాలనలో గీత వృత్తికి ఆధునిక రూపం
1 min read
నీరా ప్రాజెక్ట్ విజయవంతానికి కూటమి ప్రభుత్వం విస్తృత చర్యలు
రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్
మంగళగిరి, న్యూస్ నేడు: రాష్ట్రంలో నీరా ప్రాజెక్టు అమలు, చేపట్టాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ బీసీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీ జి. భీమశంకరరావు గాతో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి మరియు శెట్టిబలిజ కార్పొరేషన్ కుడుపూడి సత్తిబాబు , గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీరా ప్రాజెక్టు అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలు, గీత కార్మికులకు స్వయం ఉపాధి అవకాశాల కల్పన, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం, ముఖ్యంగా ఆదరణ-3 పథకం కింద టాడీ టాపర్స్కు ఆధునిక పనిముట్లతో పాటు టీవీఎస్ మోపెడ్లు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం శ్రీ కుడుపూడి సత్తిబాబు . మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమం, సంప్రదాయ వృత్తుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎస్. సవిత ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర మార్గదర్శకత్వంలో గీత కార్మికుల జీవనోపాధి మెరుగుపడేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గీత వృత్తికి ఆధునిక రూపం కల్పించి, గీత కార్మికులకు స్థిరమైన ఆదాయం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నీరా ప్రాజెక్టును అమలు చేస్తోందన్నారు. తాటి, ఈత చెట్ల నుంచి లభించే సహజసిద్ధమైన, ఆల్కహాల్ రహితమైన, పోషక విలువలు అధికంగా ఉండే “నీరా”ను ఆరోగ్య పానీయంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గీత కార్మికులకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. నీరాతో పాటు బెల్లం, తేనె, ఇతర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా గీత కార్మికుల ఆదాయాన్ని మరింత పెంచే అవకాశం ఉందన్నారు. నీరా ఉత్పత్తులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. గతంలో గీత వృత్తి నిర్వహణలో ప్రమాదాలకు గురైన కార్మికులకు తగిన భరోసా లేకపోయినా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రమాద బీమా, ఆర్థిక సహాయం, సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలుస్తోందని చెప్పారు. గీత కార్మికుల భద్రత, సంక్షేమం, ఆర్థిక స్థిరత్వం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న నీరా ప్రాజెక్టు విధానాలను అధ్యయనం చేసి, ఆంధ్రప్రదేశ్లో కూడా సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, ప్రధాన నగరాల్లో ప్రత్యేక నీరా కేఫ్లు ఏర్పాటు చేసి ప్రజలకు నీరా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గీత కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సంప్రదాయ వృత్తులకు నూతన అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సత్తిబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళ్ళుగీత కార్మిక సంఘాల నాయకులు గీతకార్మికులు పాల్గొన్నారు.

