ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నది విద్యార్థులకు మెరుగైన సేవలు అందించడానికే”
1 min read
– ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి
ప్యాపిలి న్యూస్ నేడు: “ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నది విద్యార్థులకు మెరుగైన సేవలు అందించడానికే అని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గురువారం ప్యాపిలి మండలంలోని సీతమ్మతండా గ్రామంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలోని పరిస్థితులను పరిశీలించారు.తనిఖీ సందర్భంగా విద్యార్థులకు భోజనం ఆలస్యంగా అందుతున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిర్ణీత సమయానికి భోజనం అందించడం సంబంధిత సిబ్బంది బాధ్యత అని పేర్కొంటూ, చిన్నారుల సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని స్పష్టం చేశారు.”ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నది విద్యార్థులకు మెరుగైన సేవలు అందించడానికే. విద్యార్థులకు సమయానికి ఆహారం అందించడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి” అని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం పాఠశాలలో అందిస్తున్న భోజన నాణ్యత, వసతి సౌకర్యాలు, తాగునీటి వసతి, పరిశుభ్రత, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి, అన్ని అంశాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఎమ్మెల్యే, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు లక్ష్మి నారాయణ యాదవ్,నేరేడు చేర్ల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ సుదర్శన్, బిజెపి మండల అధ్యక్షుడు దామోదర్ నాయుడు బిజెపి నాయకులు కెసి మద్దిలేటి, క్రిష్ణయ్య, మరియు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



