పత్తికొండలో కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగ యువత
1 min read
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ డిమాండ్
న్యూస్ నేడు, పత్తికొండ: డీఎస్సీ నియామకాలలో స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై సిబిఐ చే విచారణ చేపట్టాలని సోమవారం పత్తికొండలో విద్యార్థులు, నిరుద్యోగ యువత కదం తొక్కారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత చేపట్టిన ఈ ర్యాలీతో పత్తికొండ పట్టణంలో నిరసన వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించడమే చంద్రబాబు నైజమని మరోసారి రుజువైందని విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్సీపీ బాధితుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తుంటే, తామేదో నిజంగా ప్రతిభతో ఉద్యోగాలు పొందిన వారికి వ్యతిరేకమనే విధంగా ధర్నాలు, ఆందోళనలు చేయించడం సిగ్గుచేటని అన్నారు.డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాలపై అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిపై పారదర్శకంగా విచారణ జరిపించాలి.



