నిందితులతో ఫొటోలు దిగుతూ నీతులు చెబుతారా ఎస్వీ మోహన్ రెడ్డి?
1 min read
– టీడీపీ నేతలు నాగరాజు యాదవ్, మన్సూర్ అలీఖాన్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలులో మైనార్టీల మధ్య గొడవలు సృష్టిస్తూ హత్య రాజకీయాలను ప్రోత్సహించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ ఆరోపించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్మీట్కు స్పందిస్తూ గురువారం మౌర్య ఇన్లోని మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు.టీడీపీ నాయకుడు ఇంతియాజ్ను పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని వారు ఆరోపించారు. అయితే ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు ఎన్నికలకు ముందు మంత్రి టీజీ భరత్తో దిగిన ఫొటోలను బయటపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో వారు టీజీ భరత్ దగ్గర ఉన్నప్పటికీ వారి ప్రవర్తన నచ్చక గత ఎన్నికలకు ముందే వారిని దూరం పెట్టారని గుర్తు చేశారు. తాము బహిష్కరించిన వారిని వైసీపీ నేతలు చేరదీసి హత్యా రాజకీయాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారన్నారు.ఇంతియాజ్ హత్య కేసులో A1, A2, A3గా ఉన్న ముగ్గురు నిందితులు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నారని, వారు ఎస్వీ మోహన్ రెడ్డితో కలిసి దిగిన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని చూపించారు.ఒకవైపు నీతులు చెబుతూ మరోవైపు హత్య కేసులో నిందితులతో కలిసి ఫొటోలు దిగడంపై ఎస్వీ మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బర్త్డే పార్టీలకు వెళ్లి కత్తులు ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇంతియాజ్ హత్య కేసులో నిందితులతో కలిసి దిగిన ఫొటోలపై ఎస్వీ మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.ఈ వాస్తవాలను పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎస్వీ మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారని వారు విమర్శించారు. కర్నూలు నగరంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉండాలంటే వైసీపీ నాయకుల వద్ద ఉన్న రౌడీషీటర్లను పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మైనార్టీల మధ్య చిచ్చు పెట్టడం, హత్య రాజకీయాలను ప్రోత్సహించడం మానుకోవాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు.ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు కొరకంచి రవి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్, రాజు, మైనారిటీ నాయకులు మెహబూబ్ ఖాన్, ఇబ్రహీం, మెహబూబ్, రబ్బానీ, తదితరులు పాల్గొన్నారు.


