తల్లికి వందనం బదులు ‘అమ్మ ఒడి’ ప్రచారం చేయడం సరికాదు
1 min read
అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి
ఏఐఎస్పి రాష్ట్ర అధ్యక్షుడుతుమ్మల లవ కుమార్
అన్నమయ్య జిల్లా (న్యూస్ నేడు ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న తరుణంలో, అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రహ్మణ్యం మాత్రం గత ప్రభుత్వ హయాంలో అమలైన ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రచారం చేయడం దారుణమని ఆల్ ఇండియా స్టూడెంట్స్ పవర్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల లవకుమార్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక కుటుంబంలో ఎంతమంది అర్హత కలిగిన విద్యార్థులు ఉన్నా వారికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రయోజనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన ‘అమ్మ ఒడి’ పథకంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను మరింత విస్తృతంగా పరిగణనలోకి తీసుకుంటోందన్నారు.అలాంటి సమయంలో ప్రభుత్వ విద్యాశాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ ప్రస్తుత సంక్షేమ పథకాన్ని విద్యార్థులు, తల్లిదండ్రుల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే అందుకు విరుద్ధంగా గత ప్రభుత్వ పథకమైన ‘అమ్మ ఒడి’ పేరును ప్రచారం చేయడం అధికారిక కార్యక్రమాల్లో గందరగోళానికి దారితీసే అంశమని విమర్శించారు.ఒక జిల్లా విద్యాశాఖ అధికారి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే, ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలు క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఎలా చేరుతాయని ప్రశ్నించారు.అన్నమయ్య జిల్లాలో డీఈఓ సుబ్రహ్మణ్యంపై ఇప్పటికే పలు ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై దృష్టి సారించి, సమగ్ర విచారణ నిర్వహించాలని ఏఐఎస్పితరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.విచారణలో ఆరోపణలు నిజమని తేలితే డీఈఓ సుబ్రహ్మణ్యంపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే విధుల నుంచి తొలగించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ పవర్ డిమాండ్ చేస్తుందని తుమ్మల లవకుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిల్లా నాయకులు గణేష్, అశోక్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.


