ఆంధ్రకు నీళ్లు విడుదల చేయకపోవడం అన్యాయం
1 min read
ఆంధ్ర రైతుల తాగు, సాగునీటి అవసరాలను వెంటనే తీర్చాలి
నీటి వాటాను విడుదల చేయాలని టీడీపీ నాయకుల డిమాండ్
హోళగుంద న్యూస్ నేడు: తుంగభద్ర జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం సుమారు 90 టీఎంసీలకు చేరుకున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్కు తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయకపోవడం పట్ల హోళగుంద మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఆంజనేయులు, యువ నాయకులు మంజునాథ్ గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రాష్ట్రాలకు అనుసంధానమైన తుంగభద్ర జలాశయంలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని దిగువ ప్రాంతాల రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు పంటలు సాగు చేసుకునేందుకు నీటి కోసం ఎదురు చూస్తున్నారని, తాగునీటి అవసరాలు కూడా ఉన్నాయని అన్నారు.జల వనరుల శాఖ అధికారులు, సంబంధిత ప్రాజెక్టు అధికారులు రైతుల సమస్యపై తక్షణమే స్పందించాలని వారు కోరారు. గత ఏడాది కూడా ఒక పంటకు మాత్రమే నీటిని అందించి వేసవి పంటకు నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం జలాశయంలో నీరు సమృద్ధిగా ఉన్న సమయంలో కూడా ఆంధ్రకు రావాల్సిన నీటిని విడుదల చేయకపోవడం వల్ల రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జల వనరుల శాఖ మంత్రులు ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించి తుంగభద్ర జలాశయం నీటి పంపిణీపై సమన్వయంతో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీటి వాటాను ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని కోరారు.నీరు అందకపోతే రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాలు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరించారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాపై ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులతో మాట్లాడి తుంగభద్ర దిగువ కాలువకు తాగు, సాగునీటిని వెంటనే విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.


