కర్నూలులో ఘనంగా గణేష్ ఆగమనం ..
1 min read
నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలో సితార యువత ఆధ్వర్యంలో ఎన్నడూ లేనివిధంగా ఘనంగా గణేష్ మహారాజ్ ఆగమన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మరియు వైఎస్సార్సీపీ యువజన నాయకులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాల్గొని గణేష్ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలో వినాయక చవితి వేడుకలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయని అన్నారు.వినాయక నిమజ్జనానికి కర్నూలు మున్సిపల్ కమిషనర్ అన్ని అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆయన కోరారు. నిమజ్జనానికి అవసరమైన నీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, భద్రత, క్రేన్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు.కర్నూలు నగర ప్రజలు ఇప్పటికే ఎంతో భక్తిశ్రద్ధలతో గణేష్ విగ్రహాలను తమ ప్రాంతాలకు తీసుకువచ్చారని, ఇప్పుడు నీటి సమస్య ఉందని చెప్పడం సమంజసం కాదని హఫీజ్ ఖాన్ అన్నారు.నీటి సమస్య కారణంగా నిమజ్జనానికి ఇబ్బందులు ఉంటాయని ముందుగానే, కనీసం నెల రోజుల క్రితమే ప్రజలకు తెలియజేసి ఉంటే భక్తులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవారని, కానీ విగ్రహాలను ఇప్పటికే ప్రతిష్ఠించిన తర్వాత నీటి సమస్యను ప్రస్తావించడం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని ఆయన అన్నారు.“కర్నూలు నగరంలోని నా హిందూ సోదర సోదరీమణుల తరఫున మున్సిపల్ కమిషనర్ను నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. భక్తుల విశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవించి వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం జరిగేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని హఫీజ్ ఖాన్ కోరారు.వినాయక చవితి వేడుకలు కర్నూలు నగర ప్రజలందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ అని, ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ప్రభుత్వం మరియు మున్సిపల్ అధికారులు సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.


