మండల స్థాయిలో మరోసారి మెరిసిన ఏనుగుమర్రి
1 min read
చెకుముకి సైన్స్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానం
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండల స్థాయి చెకుముకి సైన్స్ పరీక్షలు శుక్రవారం ప్యాపిలి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం, మండల విద్యాధికారులు మహేశ్వరరెడ్డి, వెంకటేష్ నాయక్, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరళ ముఖ్య అతిథులుగా హాజరై ప్రశ్నపత్రాలను ఆవిష్కరించి పరీక్షలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పోటీతత్వం, సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు మూఢనమ్మకాలను తొలగించి ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోందన్నారు.ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏనుగుమర్రి ప్రథమ బహుమతి సాధించింది. ద్వితీయ బహుమతి ప్యాపిలి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు, తృతీయ బహుమతి జలదుర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దక్కింది. ప్రైవేటు పాఠశాలల విభాగంలో ప్యాపిలి శ్రీ సరస్వతి శిశు మందిరం ప్రథమ, రాచర్ల ప్రియ సిమెంట్స్ లిమిటెడ్ ఉన్నత పాఠశాల ద్వితీయ బహుమతులు సాధించాయి.పాల్గొన్న విద్యార్థులందరికీ బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులను జేవీవీ నాయకులు సన్మానించి జ్ఞాపికలు అందించారు.కార్యక్రమంలో జేవీవీ డోన్ డివిజన్ అధ్యక్షులు సర్వజ్ఞమూర్తి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ లతీఫ్, యూటీఎఫ్ ప్యాపిలి మండల అధ్యక్షులు రాజేంద్ర, రమేష్ నాయుడు, అమీర్ బాషా, శివయ్య, మద్దయ్య నాయుడు, మద్దిలేటి, ప్రతాప్ రెడ్డి, వెంకట రమణ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


