సీబీఎస్సీ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు రిడ్జ్ పాఠశాల విద్యార్థి ఎంపిక
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి డి. శివ విగ్నేష్ సీబీఎస్సీ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు సెప్టెంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు హర్యానాలోని పానిపట్లో నిర్వహించనున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో పాఠశాల సీఈఓ జి. గోపీనాథ్ మాట్లాడుతూ, “విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో కీలకం. క్రీడలు విద్యార్థుల్లో పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. శివ విగ్నేష్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం రిడ్జ్ పాఠశాలకు ఎంతో గర్వకారణం. జాతీయ స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు. కో-సీఈఓ జి. సౌమ్య గోపీనాథ్ మాట్లాడుతూ, “క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు మానసికంగా కూడా మరింత బలపడతారు. ముఖ్యంగా తైక్వాండో వంటి క్రీడలు విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన వంటి విలువలను పెంపొందిస్తాయి. శివ విగ్నేష్ తన ప్రతిభ, కఠోర సాధనతో జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.విద్యార్థిని జాతీయ స్థాయికి ఎదగడంలో కృషి చేసిన తైక్వాండో మాస్టర్ జి. సుందర్ రాజు ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ పి.కె. రాజేంద్రన్ , ప్రిన్సిపల్ ఏ. రాజ్ కమల్ , హెచ్ఓడీ లు నాగేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొని విద్యార్థిని అభినందించారు.


