PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భద్రత లేని భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలి

1 min read

రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకుల డిమాండ్                                 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 27/2024 అస్తవ్యస్తమైన భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని పత్తికొండ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా మందిరంలో బుధవారం జరిగిన అన్ని పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కుల చట్టం 27/2023ను తక్షణమే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి రామచంద్రయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వి రంగారెడ్డి, వైసిపి స్థానిక నాయకులు సోమశేఖర్, టిడిపి జిల్లా నాయకులు బత్తిని లోకనాథ్, బిజెపి నాయకులు పూనా మల్లికార్జున, లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆనందాచారి ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికార పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం భూ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చిందని నాయకులు మండిపడ్డారు. ఈ చట్టం వల్ల రైతులు వారి భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుందని న్యాయవాదులు సురేష్ కుమార్, మైరాముడు సత్యనారాయణ గుర్తు చేశారు. అనంతరం  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎన్ కృష్ణయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రజల ఆస్తులకు  భద్రత లేని భూ హక్కుల చట్టం తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అనే పేరుతో న్యాయస్థానం సివిల్ కోర్టు పరిధి కేసులన్నింటినీ ట్రిబ్యునల్ పేరు మీద జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి సివిల్ కేసులన్నీ ట్రిబ్యునల్ లో వేసుకొని కేసు వేసిన వ్యక్తికి అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకి అప్పీల్ కు  పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకు వచ్చిందని అన్నారు.ఈ చట్టo వలన సామాన్యులకు  చాలా నష్టం జరుగుతుందని తెలిపారు . కావున ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని  కోరారు. రద్దు చేయని పక్షంలో పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి రంగస్వామి, సహాయ కార్యదర్శి దామోదర ఆచారి,  మహేష్, రవి కుమారు, సీనియర్ న్యాయవాదులు చంద్రశేఖర నాయుడు, మైరాముడు, బాల భాష, కాశీ విశ్వనాథ, మధుబాబు, వాసుదేవ నాయుడు, నరసింహులు, హరికృష్ణ చారి, రాజగోపాల్ రెడ్డి, చంద్రశేఖరు క్రాంతి, మధు, కబీర్, రమేష్ బాబు, లక్ష్మన్న, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. 

About Author