PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

8  నుండి ఉచిత ఇసుక విధానం అమలు

1 min read

జిల్లాలో కౌతాళం మండలం గుడికంబాళి స్టాక్ పాయింట్ నుండి ప్రజల అవసరార్థం ఇసుక రవాణా

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 8 వ తేది  నుండి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు.శనివారం కలెక్టరేట్ మిని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్  జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డిఎల్ఎస్సీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత  ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జూలై 8వ తేది నుండి  కౌతాళం మండలం గుడికంబాళి స్టాక్ పాయింట్  నుండి  ప్రజల అవసరార్థం ఇసుక రవాణాను ప్రారంభించాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. గుడికంబాళి స్టాక్ పాయింట్ లో ఇప్పటివరకు 29 వేల 351 టన్నులు ఇసుక నిల్వ ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. గుడికంబాలి స్టాక్ పాయింట్ లో అందుబాటులో ఉన్న స్టాక్ ను వెంటనే కౌతాళం తహసిల్దార్  పంచనామా చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని విధంగా చర్యలు తీసుకోవాలని కౌతాళం తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు..  అలాగే ఇసుక డిపో వద్ద విఆర్ఎ లేదా విఆర్ఓ లను ఇన్చార్జి లుగా నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.స్టాక్ పాయింట్ లను ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాలన్నారు.ఇసుక సరఫరాలో  అక్రమాలు జరిగితే స్టాక్ పాయింట్ ఇన్చార్జి లే బాధ్యులని కలెక్టర్ హెచ్చరించారు. ఇసుక రవాణా వివరాలను తనకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.అలాగే సి.బెళగల్ మండలంలో 5 డీసిల్టిoగ్ పాయింట్లు.. కొత్తకోట, కె.సింగవరం, ఈర్లదిన్నె, గుడుమాల, పల్లెదొడ్డి   ఉన్నాయని,  వీటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే వీటిని  కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఆ మేరకు క్లియరెన్స్ వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మైన్స్ శాఖ అధికారులను ఆదేశించారు..ప్రతి డీసిల్టిoగ్ పాయింట్ వద్ద ఒక ఇన్చార్జిని నియమించాలని కలెక్టర్ కర్నూలు ఆర్డీవో ను ఆదేశించారు.వినియోగదారులకు ఎలాంటి సమస్యలు రాకుండా,  భారం లేకుండా ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇసుక నూతన విధానం అమలులోకి వచ్చినందున అక్రమాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డిఎల్ఎస్సీ)చే  ఇసుక  టన్నుకు  335 రూపాయలు నిర్ణయించడం జరిగిందన్నారు..  రేవుల్లో ఇసుక తవ్వకం, లోడింగ్,  ట్రాన్స్పోర్టేషన్, సీనరేజ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, జిఎస్టీ ల కోసం మాత్రమే  ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు.వినియోగదారులు డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.  ముందు వచ్చిన వారికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ మన జిల్లా ఇసుక ఇతర రాష్ట్రాలకు  రవాణా జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలిపారు..గనుల శాఖ డిడి రాజశేఖర్ మాట్లాడుతూ ఇసుక కోసం వచ్చే  ప్రజలు  ఇసుక ఆధార్ కార్డు జిరాక్స్ ఖచ్చితంగా తీసుకొని రావాలని సూచించారు. సమావేశంలో  పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author