గృహిణి మృతి.. ముగ్గురికి అవయవదానం
1 min read
– అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు
– లివర్, కిడ్నీలు దానం
కర్నూలు: ఇంటిలో అన్నితానై చూసుకునే మహిళా మరణించిన తర్వాత ముగ్గురికి ప్రాణాదానం చేసింది. పుట్టెడు దుఖంలో ఉన్నప్పటికీ వారి కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో స్ఫూర్తిధాయకమైంది. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా బోంకూరు గ్రామానికి చెందిన కటికె నర్సిబాయి (55) గృహిణి. ఈ నెల 25వ తేదీన తీవ్రమైన తలనొప్పి వచ్చి కిందపడిపోవడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకవెళ్లారు. అక్కడే కోమాలోకి వెళ్లారు. దీంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రోగిని పరీశీలించిన వైద్యులు తలలోపల కుడి భాగంలో తీవ్ర రక్తస్రావం అయినట్లు గుర్తించారు. ఆమెను రక్షించడానికి కిమ్స్ వైద్యులు ఎంతో శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె శనివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు.ఆ తర్వాత అవయవదానంపై, ఏపీ జీవన్ ధాన్ సమన్వయ కర్త డా. రాంబాబు బృందం మరియు కిమ్స్ ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయకర్తలు మృతురాలి కుటుంబ సభ్యులకు, బంధువులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అనంతరం భర్త, కుమారుడు మరియు కుటుంబ సభ్యుల అంగీకారంతో లివర్, రెండు కిడ్నీలు దానం చేశారు. చనిపోతూ కూడా మరో ముగ్గురికి ప్రాణదానం చేయడం మాకు గర్వంగా ఉందని మృతురాలి భర్త, కుమారుడు పేర్కొన్నారు. ఇంటి పెద్ద మరణించినా.. మరో ముగ్గురిలో జీవించి ఉన్నారని అన్నారు. అనంతరం ఏపీ జీవన్ ధాన్, డా. రాంబాబు, కర్నూలు జిల్లా ఎస్పీ పోలీస్ బృంద సహాకారంతో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అవసరం ఉన్నచోటికి అవయవాలను తరలించారని ఏపీ జీవన్ ధాన్ కమిటీ సభ్యులు తెలిపారు.