సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రైమరీ స్కూళ్లు ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతి కల్పించాలి- ఆప్టా
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతి మరియు బదలీ ల యందు సర్ప్లస్ అయిన స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు కన్వర్షన్ ఇచ్చి ప్రైమరీ పాఠశాలకు పంపటం అనే ఆలోచనను ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ( ఆప్టా) మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే ప్రభుత్వం అదే విధంగా ముందుకు వెళుతున్నది. విషయ నిపుణులు అయిన వారి సేవలను ఉన్నత పాఠశాల లో లేదా ప్రాథమికోన్నత పాఠశాల లో ఉన్నత తరగతుల బోధనకు వినియోగించుకోవాలి గాని , ఒకే క్యాడర్ అనే కుంటి సాకుతో వారిని ప్రైమరీ పాఠశాలకు పంపడం శాస్త్రీయత కాదు. ఈ విధానం సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఉన్న ప్రమోషన్ అవకాశాలను దెబ్బతీయడం అవుతుంది. మరల పుండు మీద కారం చల్లినట్లు గా రాబోయే డి ఎస్ సి ద్వారా ప్రైమరీ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులను నియమిస్తాం అనే ఆలోచన తో ప్రకటన చేయడం మరింత దారుణం.ఈ విధమైన ఆలోచన ను విద్యా శాఖ అధికారులు వెంటనే విరమించుకుని అన్ని జిల్లాల యందు సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్ లను తాత్కాలిక సర్దుబాటు చేసిన వెంటనే మిగిలిన ప్రైమరీ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులను సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాత్రమే ప్రమోషన్ కల్పించి నియామకం జరపాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ఎ జి ఎస్ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు ప్రభుత్వం ను కోరారు.ఈ విధంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఉన్న ప్రమోషన్ లను దెబ్బ తీసే ఆలోచన ను వెంటనే విరమించాలి అని లేని పక్షంలో రాష్ట్రం లో పని చేసే ఉపాధ్యాయులు యందు సెకండరీ గ్రేడ్ టీచరు లు సంఖ్యా పరంగా అధికులు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. వారందరూ ఏకతాటి పై వచ్చి ఉద్యమిస్తారు అనే విషయాన్ని వారు స్పష్టం చేశారు. ఇప్పటికీ అధికారులు సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రైమరీ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు గా ప్రమోషన్ కల్పిస్తాం అని చెబుతున్నారు కానీ ఎ జిల్లాకు ఎన్ని ప్రమోషన్ లు కల్పిస్తాం అనే విషయం లో స్పష్టత ఇవ్వడం లేదు. వెంటనే అన్ని జిల్లాల యందు అన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు గా సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాత్రమే ప్రమోషన్ కల్పించి నియామకం జరపాలని వారు డిమాండ్ చేశారు.