మదర్సాలపై తప్పుడు ప్రచారం…
1 min read
రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్
కర్నూలు, న్యూస్ నేడు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మదర్సాలు, మసీదుల అభివృద్ధికి కృషి చేస్తోందని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. నగరంలోని రోజా వీధిలోని మదర్సా వద్ద రోజా మసీదు ప్రపోజ్డ్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రోజా వీధిలో ఉన్న మదర్సాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. మదర్సా నిర్వహణ గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థను క్రమపద్దతిలో గాడిలో పెడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే రోజా వీధిలోని మదర్సా ద్వారా ఆదాయం పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే వక్ప్ బోర్డు అధికారులను సంప్రదించి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. మదర్సా ద్వారా వచ్చే ఆదాయాన్ని రోజా మసీదు నిర్వహణకు ఉపయోగించాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. ఎందుకంటే ప్రతి నెలా రోజా మసీదు నిర్వహణకు రూ. 20 వేల నుండి రూ.25వేల దాకా ఖర్చవుతుందన్నారు. మసీదుకు వచ్చే ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉందని పేర్కొన్నారు. మదర్సాను ఇప్పుడు ప్రతి రోజూ ఒక గంటసేపు ట్యూషన్ చెప్పే సమయానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. సమీప ప్రాంతంలోనే మరొక మదర్సా కూడా ఉన్నట్లు తెలిపారు. రెండు మదర్సాలు దగ్గరగా ఉండటం వల్ల ఈ మదర్సా ఎక్కువగా ఉపయోగపడటం లేదన్నారు. ఇక్కడకు వచ్చే 15 మంది విద్యార్థులు రోజా మసీదులో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో దీని ద్వారా ఆదాయం వచ్చేలా చేసి.. వచ్చే డబ్బును రోజా మసీదు నిర్వహణకు ఉపయోగించుకుంటే ఎంతో మేలు జరుగుతుందన్నారు. అయితే కొందరు గిట్టని వ్యక్తులు దీనిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి టి.జి భరత్ అనుచరులు మదర్సాలను కబ్జా చేస్తున్నారని తప్పుడు సందేశాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నారు. మంత్రి టి.జి భరత్ మదర్సాలు, మసీదుల అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డు భూములు కబ్జాకు గురవ్వకుండా ఆయన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ ప్రజలను కోరారు.