కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి – ఎమ్మెల్యే
1 min read
ఉంగుటూరు నియోజకవర్గంలోని కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకుని, వినతిపత్రాలు స్వీకరించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు
గోదావరి సమావేశ మందిరంలో వెనతులు స్వీకరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :కొల్లేరు ప్రాంతంలోని ప్రజల జీవన స్థితిగతులు, వారి సమస్యలను ఆ ప్రాంతానికి చెందిన మహిళలు, మత్స్యకారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలుకు బుధవారం తరలివచ్చి కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్,మెంబెర్ కార్యదర్శిలు డా. జె.ఆర్. భట్, జి. భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్ లకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను సానుకూల దృక్పధంతో పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కమిటీని కోరారు. కొల్లేరు అభివృద్ధి బోర్డు తిరిగి ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధిలోని 14 వేల ఎకరాల జిరాయితీ భూమిదారులు, 20 వేల ఎకరాల డి.ఫారం పట్టాదారుల హక్కులను కాపాడాలని, కొల్లేరు ప్రాంతంలోని 20 వేల మందికి పైగా రైతులు మారారన్నారు. ప్రభుత్వాలు కాంటూర్ పరిధిని తగ్గిస్తామని హామీ ఇచ్చారని, కానీ అది అమలు జరగలేదన్నారు. కొల్లేరు పరిధిలోని డ్రైన్లు డీసిల్టింగ్ చేయని కారణంగా కొల్లేరు ప్రాంతం వర్షాకాలం, వరదల సమయంలో ముంపునకు గురి అవుతున్నదన్నారు. డ్రైన్ల మరమ్మత్తులకు 3 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ అభయారణ్య పరిధి అని పనులు చేపట్టలేదన్నారు. కొల్లేరు ప్రాంతంలోని ప్రజలు పర్యావరణం ప్రేమికులని, పక్షుల రక్షణకు వారు కట్టుబడి ఉన్నారన్నారు. ఆ ప్రాంత ప్రజల జీవనోపాథి మెరుగుదలకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. వన్యప్రాణి అభయారణ్యం అభివృద్ధి కి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో భూములు కోల్పోయిన జిరాయితీ, బి.ఫారం పట్టాదారులకు న్యాయం చేయాలనీ కోరారు. కొల్లేరు అభయారణ్యం చట్టం చేసినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కనీస అవగాహన కలిగించలేనిదన్నారు. ఆ సమయంలో ఒకే ఒక వ్యక్తి స్పందించారని, దీనినిబట్టి కొల్లేరు చట్టంపై ఏ విధమైన అవగాహన కలిగించారన్నది స్పష్టం అవుతుందన్నారు. సైదు సత్యనారాయణ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో 4 లక్షలకు పైగా ప్రజలు జీవిస్తున్నారని, జిరాయితీ, బి.ఫారం పట్టాదారుల హక్కులను కాపాడి, ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, అటవీ ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ అజయ్ కుమార్ నాయక్, మత్యశాఖ కమీషనర్ రమాశంకర్ నాయక్,జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, డిఎఫ్ఓ లు శుభం, విజయ,డిఆర్ఓ వి.విశ్వేశ్వరరావు,ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

