ప్రయాణీకుల-బస్సు భద్రతా చట్టాన్ని తీసుకురండి ..
1 min read
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: దేశానికి సంబంధించిన కీలకమైన రవాణా మరియు భద్రతా విషయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఢిల్లీలో ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి కేంద్ర మంత్రిని.. మంత్రి టీజీ భరత్ కలిశారు. ఇటీవల బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో బస్సు ప్రమాదంలో మంటల్లో చిక్కుకొని ప్రయాణికులు చనిపోయారు. అధునాతన అగ్నిమాపక వ్యవస్థలపై ఆయన ఇదివరకు ఇచ్చిన వినతి మేరకుకొత్త ప్రయాణీకుల-బస్సు భద్రతా చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. గుత్తి పెట్రోల్ బంక్ సర్కిల్ నుండి పెద్దటేకూరు వరకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న హైవే లైటింగ్ గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ప్రతిపాదన పరిశీలనలో ఉందని ఆయన తెలిపారన్నారు. ఇక కర్నూలు-బళ్లారి జాతీయ రహదారి ప్రతిపాదనతో సహా ముఖ్యమైన ప్రాంతీయ రహదారి అనుసంధాన అవసరాలను వివరించినట్లు చెప్పారు. ఇది ట్రాఫిక్ను సులభతరం చేయడానికి, వాణిజ్యాన్ని పెంచడానికి మరియు మన ప్రజలకు అంతర్రాష్ట్ర అనుసంధానాన్ని మెరుగుపరచడానికి కీలకమైనదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో, హైవే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, భద్రతను పెంచడానికి మరియు ప్రతి పౌరుడికి సున్నితమైన అనుసంధానాన్ని నిర్ధారించడానికి కృషి చేస్తున్నామని టీజీ భరత్ అన్నారు. కేంద్ర మంత్రితో జరిగిన చర్చ ఎంతో సానుకూలంగా సాగిందన్నారు.


