వేగవంతమైన అభివృద్ధి.. కూటమి తోనే సాధ్యం
1 min read

కర్నూలు మెడికల్ కాలేజీలో వి.ఆర్.డి.ఎల్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు, న్యూస్ నేడు: వేగవంతమైన పాలన మా ప్రభుత్వంలోనే సాధ్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వి.ఆర్.డి.ఎల్ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. పనులకు భూమి పూజ చేసిన తక్కువ కాలంలోనే ఈ భవన నిర్మాణం పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వేగవంతమైన పనులు మా ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఇంకా ఆస్పత్రిలో కావాల్సిన వెంటిలేటర్లు, ఆల్ట్రా సౌండ్ మిషన్లు ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. హాస్పిటల్ బిల్డింగులకు లీకేజీలు ఏర్పడ్డాయని తెలిసిన వెంటనే బాగుచేసేందుకు చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ పనులు వేగంగా చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా హాస్పిటల్లో రూ.50 కోట్లతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుచేయబోతున్నామన్నారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నామన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్న డాక్టర్లను మంత్రి టీజీ భరత్ గుప్తా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, డాక్టర్లు, హెచ్.డి.సి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

