జర్నలిస్టులపై దాడులకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆందోళన
1 min read
పత్తికొండ విలేఖరి నాగరాజుపై దుర్భాషలు, అవమానకర ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
సీఐ జయన్నను సస్పెండ్ చేసి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఏపీయూడబ్ల్యూజే నాయకుల డిమాండ్
హొళగుంద న్యూస్ నేడు: పత్తికొండ విశాలాంధ్ర విలేఖరి ఎం. నాగరాజుపై ఆలూరు–పత్తికొండ సీఐ జయన్న పోలీస్స్టేషన్ ఆవరణలో ప్రజల సమక్షంలో దుర్భాషలాడి, అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ హొళగుంద మండల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.మండల ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సిహెచ్. నాగరాజ్, కార్యదర్శి ఎం. రవికాంత్, తాలూకా ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు హెచ్. విరుపాక్షి, కే. నాగప్ప, ఈ. నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టి తహసీల్దార్ లక్ష్మీరాజుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, అవమానాలను అరికట్టాలని, బాధిత విలేఖరికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. “పోలీసుల జులుం నశించాలి”, “జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి”, “ఏపీయూడబ్ల్యూజే జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు.మండల ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సిహెచ్. నాగరాజ్ మాట్లాడుతూ పత్తికొండ విశాలాంధ్ర విలేఖరి నాగరాజుపై దుర్భాషలాడి, అవమానకరంగా ప్రవర్తించిన సీఐ జయన్నపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేఖరిని అవమానపరిచిన ఘటనపై సీఐ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.జర్నలిస్టుల సంఘాలు, ప్రజాసంఘాలు, ఐక్య జర్నలిస్టుల కార్యాచరణ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని కోరారు.అలాగే ఐ న్యూస్ విలేఖరులను అక్రమంగా నిర్బంధించి జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఐ న్యూస్ విలేఖరుల అరెస్టును నిరసిస్తూ, వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులు, విలేఖరులపై వేధింపులు, దాడులు, అవమానకర ఘటనలు భవిష్యత్తులోనూ కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఏపీయూడబ్ల్యూజే నాయకులు హెచ్చరించారు.తహసీల్దార్ లక్ష్మీరాజు స్పందిస్తూ ఏపీయూడబ్ల్యూజే నాయకులు సమర్పించిన వినతిపత్రాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఫిర్యాదులోని అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ ఆందోళనలో మండల ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సిహెచ్. నాగరాజ్, కార్యదర్శి ఎం. రవికాంత్, తాలూకా ఉపాధ్యక్షులు హెచ్. విరుపాక్షి, కే. నాగప్ప, ఈ. నాగరాజ్ గౌడ్, మండల నాయకులు మంజునాథ్, ముధసిర్, మహేష్ గౌడ్, సంజయ్, తాహెర్, హనుమంత్, ముల్లా హరూన్ పాల్గొన్నారు.


