విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు పెరటి తోటల పెంచాలి
1 min read
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఎస్ హెచ్ జి మహిళలకు రూ:3,000/- విలువైన విత్తనాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో (హాస్టళ్లలో) చదువుకుంటున్న విద్యార్థులకు నిత్యం తాజా, పౌష్టిక ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హాస్టల్ ప్రాంగణాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ భూమిని సద్వినియోగం చేసుకుంటూ, స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల భాగస్వామ్యంతో ఆకుకూరలు, కూరగాయలు పండించేలా చర్యలు చేపట్టారు. ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా, ఆసక్తి కలిగిన SHG సభ్యులకు సుమారు రూ. 3,000/- విలువైన నాణ్యమైన కూరగాయల, ఆకుకూరల విత్తనాలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బుధవారం కలెక్టరేట్ లో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడతగా డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులం, పెదవేగి, APTWRS (బాలుర గురుకులం), బర్రింకలపాడు, GTW ఆశ్రమ పాఠశాల, రెడ్డిగూడెం (రెడ్డికొపల్లె) ఎంపిక ఎంపిక చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. హాస్టళ్లలోనే సేంద్రీయ పద్ధతిలో పండించే ఈ కూరగాయలను నేరుగా ఆయా హాస్టళ్లకే సరఫరా చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల విద్యార్థులకు కెమికల్స్ లేని తాజా ఆహారం లభించడమే కాకుండా, స్థానిక SHG మహిళలకు అదనపు ఉపాధి మరియు ఆర్థిక స్వాలంబన చేకూరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు, సంఘాల సభ్యులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమము లో డి.ఆర్.డి.ఏ పీడీ టీ.వి.విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

