పట్టణాల అభివృద్ధిలో కమిషనర్లే కీలకం
1 min read
యంత్రాంగంతో సమర్థవంతంగా పనిచేయించాలి
మున్సిపల్ శాఖ సిడిఏంఏ పి.సంపత్ కుమార్, ఐఏయస్
జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారంనగర/పట్టణాల అభివృద్ధిలో కమిషనర్లే కీలకమని, వారు బాధ్యతగా, స్మార్ట్ వర్క్తో సమర్థవంతంగా పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని రాష్ట్ర పురపాలక శాఖ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సిడిఎంఏ) పి.సంపత్ కుమార్, ఐఎయస్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో డోన్ కమిషనర్తో సమీక్ష సమావేశం నిర్వహించారు.అంతకుముందు గార్గేయపురం, జొహరాపురం డంప్ యార్డుల్లో బయో మైనింగ్, సి & డి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని పరిశీలించారు. గార్గేయపురం డంప్యార్డులో ఘన వ్యర్థాల బయో మైనింగ్ జాప్యం చేయొద్దని స్పష్టం చేశారు. 15 ఎకరాల్లో బయో మైనింగ్ పూర్తి అయిన వెంటనే చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి (వెస్ట్ టు ఎనర్జీ) ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని, మరో 9.5 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. బయో మైనింగ్ పనులను రోజువారీ లక్ష్యాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. గార్గేయపురం డంప్యార్డులో రెండు నెలల్లో, జొహరాపురం డంప్యార్డులో ఒక నెలలో బయో మైనింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.జీవో 75ను పక్కాగా అమలు చేయాలని, ప్రజాప్రతినిధులకు సైతం దీని గురించి తెలియజేయాలని ఆదేశించారు. ఇంటింటికీ డిజిటల్ క్యూ ఆర్ కోడ్ వ్యవస్థ అమలు చేసి, శాటిలైట్ ఆధారంగా ఆస్తుల విస్తీర్ణం, ప్రభుత్వ-ప్రైవేటు సేవలకు సమాచారాన్ని అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఆస్తి పన్ను వసూళ్లు మెరుగుపరచాలని సూచించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యాలని తెలిపారు. డ్రైనేజీ లేకపోతే కనీసం కచ్చా కాలువ అయినా నిర్మించాలని, ప్రతిదానిని నిధులతో ముడిపెట్టడం సరికాదన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో సాధ్యమైనంత సమస్యలను పరిష్కరించాలని సూచించారు.రాయలసీమ ప్రాంత పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు మొక్కుబడిగా కాకుండా కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. పైపై విధులు సరికాదని, సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.సమావేశంలో అనంతపురం ఆర్డిఎంఏ నాగరాజు, కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఎమ్మిగనూరు కమిషనర్ గంగిరెడ్డి, ఆదోని కమిషనర్ నయీం, గూడూరు కమిషనర్ ఏ.వి. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

