రాష్ట్రంలోనే అతి పెద్దదైన గాయత్రి గోశాల అభివృద్ధికి సహకరించండి
1 min read
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్రంలోనే అతి పెద్దదైన కర్నూలులోని గాయత్రి గోశాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని గాయత్రి గోశాల కమిటీ సభ్యులతో కలిసి మంత్రి టీజీ భరత్ గుప్తా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర శివారులోని గాయత్రి గోశాలలో 12 వందలకు పైగా గోవులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోనే ఇది పెద్ద గోశాల అని తెలిపారు. గోవులకు గ్రాసం విషయంలో దాతల సహకారంతో ముందుకు వెళుతున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి సహకారం అందించేందుకు కృషి చేయాలని మంత్రిని కోరారు. దీంతో పాటు గోశాల స్థలంలో టీటీటీ తరుపున వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని కోరారు. దీంతో పాటు కర్నూలులో ఉన్న దేవాదాయశాఖ గోశాల స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు సహకారం అందించాలన్నారు. ఈమేరకు మంత్రికి వినతిపత్రం అందజేశారు. వీటన్నింటిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పూర్తి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. గతంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కర్నూలుకు వచ్చిన సందర్భంగా గాయత్రి గోశాలను సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గోశాల అధ్యక్షుడు జగదీష్ గుప్తా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

