నేడు పత్తికొండలో యువస్పందన ఆధ్వర్యంలో “సామాజిక వనయజ్ఞం”
1 min read
న్యూస్ నేడు,పత్తికొండ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5వ తేదీన పత్తికొండ పట్టణంలో యువస్పందన సొసైటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున “సామాజిక వనయజ్ఞం” (మొక్కలు నాటే కార్యక్రమం) నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేంద్ర, లక్ష్మన్న తెలిపారు. గురువారం పత్తికొండ పట్టణంలో ఈరోజు స్పందన సొసైటీ స్టడీ సర్కిల్లో వారు విలేకరులతో మాట్లాడుతూ… ప్రస్తుత కాలంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భానుడి భగభగలకు మానవాళి అల్లాడిపోతోందని, దీనికి ఏకైక పరిష్కారం మొక్కలను నాటడమేనని అన్నారు. “చెట్టే జీవనం” అనే నినాదంతో రేపటి మన భావితరాల భవిష్యత్తు కోసం, వారికి స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించడం కోసమే యువస్పందన ఈ “హరిత సంకల్పాన్ని” భుజాన వేసుకుందని వివరించారు. మీ వంతుగా జూన్ 5వ తేదీ శుక్రవారం పత్తికొండ నివాసిత ప్రజలు, యువతీ యువకులు, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన చోట, వీలైన స్థలంలో కనీసం ఒక మొక్కనైనా నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఒకవేళ సొంతంగా మొక్కలు నాటడానికి వీలుకాని పక్షంలో, పత్తికొండలో యువస్పందన సొసైటీ ఆధ్వర్యంలో సాగే సామాజిక వనయజ్ఞంలో స్వచ్ఛందంగా పాల్గొని, మీ చేతుల మీదుగా ఒక మొక్కను నాటాలని హృదయపూర్వక పిలుపునిచ్చారు. ఈ సామాజిక మహోద్యమాన్ని విజయవంతం చేసి, మన పత్తికొండను పచ్చని వనంగా మార్చడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కదిలిరావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సొసైటీ సభ్యులు గిరీష్, రాజేశ్వరి, వాలంటీర్లు పాల్గొన్నారు.

