ఓటర్ల తాఖీదుల విచారణకు సహకరించాలి
1 min read
రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈఆర్వో చల్లా ఓబులేసు విజ్ఞప్తి
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం ఓటర్ల జాబితా సవరణ ఎ(స్ఐఆర్ – సర్) ప్రక్రియలో భాగంగా జాబితాలోని పేర్లలో తప్పిదాలు, మ్యాపింగ్ లేకపోవడం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు తదితర కుటుంబ సభ్యుల వయసుల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు బీఎల్ఓలు తాఖీదులు జారీ చేశారని, వాటిపై అభ్యంతరాలు ఉన్నవారు నిర్దేశించిన తేదీన విచారణకు హాజరై తమ అర్జీలు, ఆధారాలను సమర్పించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో), నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. ఈ ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని సూచించారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈఆర్వో మాట్లాడుతూ.. నోటీసులు జారీ అయిన ఓటర్లు నిర్ణీత సమయంలో స్పందించి విచారణ ప్రక్రియకు సహకరించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత బీఎల్ఓలు, ఎన్నికల సిబ్బందిని సంప్రదించి వివరాలను తెలుసుకోవాలన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం, నోటీసుల విచారణ ప్రక్రియ కొనసాగుతున్నందున రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఓటర్లకు అవగాహన కల్పించి సహకరించాలని కోరారు.కార్యక్రమంలో అడిషనల్ ఏఈఆర్వోలు డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, తదితరులు పాల్గొన్నారు.


