కరెంటు వైర్ల చోరీ కేసులో ఐదుగురు దొంగల అరెస్టు
1 min read
రూ.1.05 లక్షల విలువైన 1500 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్లు స్వాధీనం
హోళగుంద న్యూస్ నేడు: నెరనికి గ్రామ సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో జరిగిన కరెంటు వైర్ల చోరీ కేసును హొలగుంద పోలీసులు ఛేదించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు హొలగుంద ఎస్సై దిలీప్ కుమార్ సోమవారం ప్రెస్నోట్లో తెలిపారు.గత మే 30వ తేదీ అర్ధరాత్రి సమయంలో నెరనికి గ్రామ సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నుంచి సుమారు రూ.1,05,000 విలువైన 1500 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్లు దొంగిలించబడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఈరోజు (జూన్ 1) మధ్యాహ్నం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నెరనికి గ్రామ శివారులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నేరానికి ఉపయోగించిన ఒక ఆటోతో పాటు దొంగిలించబడిన 1500 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో నిందితులైన ఖాసీం, శివరాజ్, వెంకటేష్ గౌడ్, ఈరేశ్, పరమానంద్లను అరెస్టు చేసినట్లు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వైర్ల విలువ సుమారు రూ.1.05 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు.

