ఫ్రైడేని డ్రైడేగా పాటించాలి
1 min read
ప్రతి శుక్రవారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం “ఫ్రైడే–డ్రైడే” కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పెద్దపాడు రస్తాలోని ఇందిరాగాంధీ కాలనీ (బీడి వర్కర్స్ కాలనీ) నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం ఇళ్లలో, కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, వ్యాపార సంస్థల్లో నీరు నిల్వ ఉండే కూలర్లు, సిమెంట్ తొట్టిలు, డ్రమ్లు, బకెట్లు, పూల కుండీలు, ఫ్రిజ్ ట్రేలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు తదితర వస్తువుల్లో నీటిని పూర్తిగా తొలగించాలని సూచించారు. వారానికి ఒకసారి నీటి నిల్వ పాత్రలను ఖాళీ చేసి, బ్రష్తో శుభ్రపరచి తిరిగి ఉపయోగించాలని తెలిపారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలే దోమల ఉత్పత్తికి ప్రధాన కారణమని, ప్రతి శుక్రవారం నాడు వాటిని శుభ్రం చేసి పొడిగా ఉంచడం ద్వారా దోమల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలని, పాడైపోయిన వస్తువులు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు వంటి వాటిలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమల నివారణ, నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని, ప్రతి ఒక్కరూ “ఫ్రైడే–డ్రైడే” కార్యక్రమాన్ని అలవాటుగా మార్చుకుని ప్రజారోగ్య పరిరక్షణకు తోడ్పడాలని కమిషనర్ చల్లా ఓబులేసు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, సినియర్ ఎంటమాలజిస్ట్ సత్యనారాయణ, హెల్త్ అసిస్టెంట్ వేణుగోపాల్, సానిటరీ ఇంస్పెక్టర్లు మల్లికార్జున, అలీమ్ బాష, తదితరులు పాల్గొన్నారు.


