భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలి…
1 min read
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులకు ఆదేశం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: చింతలపూడి ఎత్తిపోతల పధకం ప్రధాన కాలువ తవ్వకాలకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.చింతలపూడి ఎత్తిపోతల పధకం భూసేకరణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో జేసీ అభిషేక్ గౌడ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ ముఖ్యంగా అసైన్మెంట్ భూములకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా చర్చించి, సంబంధిత భూసేకరణ అధికారులు మరియు తహసీల్దార్లు నోటీసులు జారీ చేసి,చట్టబద్ధమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే ఇప్పటికే ప్రకటించిన భూసేకరణ అవార్డుల స్థితి, భూస్వాములకు పరిహార చెల్లింపుల పురోగతి, భూసేకరణ పూర్తయిన భూములను నీటిపారుదల శాఖకు అప్పగించిన స్థితిని జేసీ సమీక్షించారు. చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటని, భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ సూచించారు. పెండింగ్లో ఉన్న పరిహార చెల్లింపులు మరియు భూముల అప్పగింత ప్రక్రియను వేగవంతం చేసి, ప్రాజెక్టు పనులు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. అదేవిధంగా, జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామానికి సంబంధించిన ఆర్ఓఎఫ్ఆర్ (ROFR – Recognition of Forest Rights) భూములఅంశాన్ని కూడా సమావేశంలో సమీక్షించారు. ఈ భూములకు సంబంధించిన ధృవీకరణను సంబంధితప్రాజెక్టు అధికారి, ఐటీడీఏ (PO, ITDA) మరియుడివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డి యఫ్ ఓ) ద్వారా పొందాలని జేసీ సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన ధృవీకరణలను త్వరితగతిన పూర్తి చేసి, తదుపరి భూసేకరణ ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామ సమీపంలో గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి చింతలపూడి ప్రధాన కాలువను దాటే ప్రదేశంలో తగిన నిర్మాణం చేపట్టాల్సిన అంశాన్ని సమీక్షించారు. గతంలోనే ఎన్హెచ్ఏఐ (NHAI) అధికారులను కోరినప్పటికీ, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. దీనిపై జేసీ స్పందిస్తూ, ఈ అంశంపై నీటిపారుదల శాఖ అధికారులు ఎన్హెచ్ఏఐ అధికారులకు మరోసారి లేఖ రాయాలని,ఆ లేఖ ఆధారంగా జిల్లా యంత్రాంగం కూడా ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులకు నివేదిక పంపి అవసరమైన చర్యలు తీసుకునేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, సంబంధిత మండలాల తహసీల్దార్లు, చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం కార్యనిర్వాహక ఇంజనీర్లు మరియు సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు.



