దేవరగట్టు వరుణ యాగంలో పాల్గొన ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
1 min read

స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు.. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన
హోళగుందన్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం సమితిగేరి గ్రామానికి చెందిన రామిరెడ్డి ఆహ్వానం మేరకు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి దేవరగట్టులోని శ్రీ శ్రీ శ్రీ మాల మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో మూడవ రోజు నిర్వహించిన వరుణ యాగ మహోత్సవంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు శశికళ కృష్ణమోహన్ కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, శశికళ కృష్ణమోహన్లకు ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ, దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామివారి క్షేత్రం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమని అన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.వరుణ యాగం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. యాగశాలలో వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



