మోడీ విధానాలు దేశానికి ప్రమాదకరం…
1 min read
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమాలు చేపడుదాం… పి. రామచంద్రయ్య
సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య
పత్తికొండ, న్యూస్ నేడు: కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య లు పేర్కొన్నారు. శనివారం స్థానిక చదువుల రామయ్య భవనంలో సిపిఐ మండల సమితి సమావేశం పట్టణ కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వచ్చిన 100 రోజులలో పే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని, ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి రెండు పర్యాయాలు పూర్తి అయినా కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చింది లేదన్నారు. భారతదేశం లౌకిక దేశమని మతతత్వ బిజెపి కులాలు,మతాల మధ్య చిచ్చులు పెడుతూ దేశాన్ని హిందూ రాజ్యం గా మార్చి వేసేందుకు కుట్రలు పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో భద్రత వైఫల్యాల కారణంగానే ఉగ్రవాద దాడులు చోటుచేసుకుని 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అన్నారు. దేశంలో మతోన్మాదం, ఉగ్రవాదాన్ని రూపుమాపి దేశ సమైక్యత, సమగ్రత, లౌకిక పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ప్రజలకు ఆచరణలో సాధ్యం కాని హామీలను ఇచ్చి, అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కావస్తున్నా ఏ ఒక్కటి నెరవేర్చింది లేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.