ఒక్క ఉద్యోగం కుటుంబాన్ని పోషిస్తుంది
1 min read
ప్రతి మూడు నెలలకోసారి జాబ్మేళా నిర్వహిస్తున్నాం
యువత ఉద్యోగాలు పొందేందుకు నైపుణ్యాలు నేర్చుకోవాలి
కర్నూలులో జాబ్మేళా ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు, న్యూస్ నేడు : ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలు నగరంలోని బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో జాబ్మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 కంపెనీల్లో 1125 ఉద్యోగాలను ఈ జాబ్మేళా ద్వారా భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. యువతీ, యువకులు తగిన నైపుణ్యాలతో ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఉద్యోగాలు సాధించిన యువత ఆ తర్వాత అదే కంపెనీలో స్థిరంగా ఉద్యోగం చేయాలన్నారు. కంపెనీలో పనికి తగ్గట్టు స్కిల్స్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓర్వకల్లుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా కంపెనీలు తీసుకొస్తున్నామన్నారు. జైరాజ్ ఇస్పాత్ కంపెనీని అప్పట్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని, ఇప్పుడు అదే కంపెనీ మరో రూ.6వేల కోట్లతో పెట్టుబడి పెడుతోందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అవసరమైన మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి, కళాశాల ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్, ఏపీఐఐసీ డైరెక్టర్ జగదీష్ గుప్తా, డీఎస్పీ మెహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.



