కరెంట్ స్తంభాన్ని ఢీకొని ఒకరు దుర్మరణం..
1 min read
కలెక్టరేట్ లో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న నాగరాజ్..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో చోటు చేసుకుంది.మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నందికొట్కూరు పట్టణం ఏబీఎం పాలెంనకు చెందిన కాటేపోగు నాగరాజు గురువారం ఉదయం ఇంటి నుండి నంద్యాలకు తన స్నేహితుని బైక్ తీసుకొని వెళ్తూ ఉండగా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు దగ్గర రోడ్డు పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఉ 7 గంటల సమయంలో ఢీ కొట్టడంతో తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న ఎస్సై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆటోలో నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. నాగరాజు నంద్యాల కలెక్టరేట్ లో (ఐఅండ్ పీఆర్) ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.ప్రతిరోజూ యధావిధిగా విధులకు వెళ్లేవాడు.ఈ సంఘటన జరగడంతో కుటుంబ సభ్యుల్లో రోదనలు మిన్నంటాయి.10 సంవత్సరాల క్రితం భార్య లక్ష్మితో వివాహం అయింది. సంతానం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.నాగరాజ్ తమ్ముడు నాగార్జున కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.మార్చురీలో ఉన్న నాగరాజు మృతదేహాన్ని నంద్యాల సమాచార శాఖ అధికారులు పరిశీలించారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.