నియోజకవర్గంలో ప్రజా అవసరాలకు పెద్దపీట
1 min read
కోట్లాది రూపాయలు వెచ్చించి యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు
పనులను తనిఖీ చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
సెయింట్ ఆన్స్ కాలేజీ నుండి సత్రంపాడు అడ్డరోడ్డు వరకు సీసీ నిర్మాణ పనులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : నియోజకవర్గంలో ప్రజా అవసరాలకు పెద్దపీట వేస్తున్నామని, కోట్లాది రూపాయలు వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు గవరవరంలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ నుండి సత్రంపాడు అడ్డరోడ్డు వరకు నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను స్థానిక బిషప్ హౌస్ వద్ద ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా అవసరాలను గుర్తించడంలో కూటమి ప్రభుత్వమెప్పుడూ ముందుంటుందన్నారు. ఇదేక్రమంలో గత నలభైయాళ్ళుగా నిర్లక్ష్యానికి గురైన ఈ రహదారి నిర్మాణానికి శరవేగంగా చర్యలు తీసుకున్నామన్నారు. అందుకు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటూ ఆర్అండ్బి మంత్రితో మాట్లాడి 90లక్షల రూపాయల నిధులను కూడా తీసుకురావడం జరిగిందన్నారు. ఈ రోడ్డును నిర్మించేందుకు 26 విద్యుత్ స్థంభాలను మార్చాలన్న ఆయన దానిపై సంబంధిత అధికారులతో మాట్లాడి, అందుకు అవసరమైన 5లక్షల 20వేల రూపాయల నిధులను కూడా కార్పొరేషన్ నుండి కేటాయించామన్నారు. ఇవేమి పట్టని కొందరు నాయకులు ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అటువంటి వారు క్షేత్రస్థాయికి వచ్చి మాట్లాడాలనీ, అంతేగానీ అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. విమర్శలు చేసే వారంతా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఏం చేయాలో సలహాలిస్తే అవికూడా తాను గౌరవంగా స్వీకరిస్తానంటూ ఎమ్మెల్యే చంటి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం,ఎస్సెమ్మార్ పెదబాబు,నాయకులు అమరావతి అశోక్,గూడవల్లి వాసు తదితరులు పాల్గొన్నారు.
