హామీలు ఇచ్చి మరిచిపోయిన గత ప్రభుత్వం…
1 min read
పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసిన కూటమి ప్రభుత్వం
ఎమ్మెల్యే శ్రీ కె.ఈ. శ్యామ్ కుమార్ స్పష్టం
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే శ్రీ కె.ఈ. శ్యామ్ కుమార్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, వంతెనలు, సంక్షేమ వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పత్తికొండ నియోజకవర్గం లోని క్రిష్ణగిరి మండలం కటారుకొండ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ హాస్టల్ను గురువారం ప్రారంభించారు. అనంతరం చిట్యాల గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రజలకు అంకితం చేశారు.తదుపరి కోయిలకొండ గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించి, సీసీ రోడ్డును ఆయన ప్రజలకు అంకితం చేశారు.కోయిలకొండ–కంబాలపాడు* గ్రామాల మధ్య నూతనంగా నిర్మించిన వంతెనను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వంతెన నిర్మాణానికి గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్తికొండ పర్యటన సందర్భంగా హామీ ఇచ్చినా, ఐదేళ్ల పాలనలో ఆ హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.అదేవిధంగా తుగ్గలి మండలం బొందిమడుగుల వంతెనకు కూడా గత ప్రభుత్వం హామీ ఇచ్చి పూర్తి చేయలేకపోయిందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోయిలకొండ–కంబాలపాడు వంతెనతో పాటు బొందిమడుగుల వంతెనను కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు.


