మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి!
1 min read
45 రోజులు గడిచిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నిరసన దీక్ష
విజయవాడ, న్యూస్ నేడు: నిరసన దీక్ష చేపట్టి నేటికీ 45 రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావటం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర ఉపాధ్యక్షుడు జైపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం, అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 45 వ రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలో భాగంగాఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల గోడు పట్టించుకోకుండా ప్రభుత్వం వేడుక చూస్తుందన్నారు. చాలీచాలని అరాకొరా జీతాలతో ఎంతకాలం పని చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. పెరిగిన రేట్లతో వచ్చే జీతాలు సరిపడక కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదనపడ్డారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీతాలు పెంచాలని, తక్కువ జీతం లో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికులకు తక్షణం సంక్షేమ పథకాలు అమలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. 13 వేలు జీతం తీసుకుంటున్న మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనం పథకంలో మినహాయింపును అమలు పరచడం సరికాదన్నారు. ఆప్కోస్ విధానంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కరించకుంటే తదుపరి కార్యాచరణలో భాగంగా కలెక్టరేట్ల ముట్టడి, కుటుంబ సభ్యులతో కలిసి నిరసనలు, చేపడతామన్నారు. చాలని జీతాలతో కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న తమకు చావంటే భయం లేదని, నిరసన దీక్షలో భాగంగా చావడానికైనా వెనుకాడబోమని, రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అంతా ఏకమై రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షలో కోశాధికారి కృష్ణ, నగర నాయకులు సాంబ, కమిటీ సభ్యులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
