రసాయనిక ఎరువుల వినియోగం తగ్గాలి..
1 min read
ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం లక్ష్యాలను సాదించాలి
ద్వారకా తిరుమల మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన
వ్యవసాయ, అనుబంధ రంగాలలో ప్రకృతి వ్యవసాయం సాగు పరిశీలించి, రైతులను అభినందించిన కలెక్టర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వ్యవసాయాధికారులను ఆదేశించారు. ద్వారకాతిరుమల మండలంలోని ద్వారకాతిరుమల, గుండుగొలనుకుంట, సూర్యచంద్రరావుపేట, తదితర గ్రామాలలో గురువారం సుడిగాలి పర్యటన చేసి, వ్యవసాయ, అనుబంధ రంగాల సాగు పద్దతులను పరిశీలించారు. ముందుగా ద్వారకాతిరుమలలో ఫార్మ్ పాండ్స్ ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గుండుగొలనుగుంట గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించి ఆదర్శ రైతు ఒబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయంతో సాగుచేస్తున్న కాయగూరలు, పండ్ల తోటలను కలెక్టర్ పరిశీలించారు. సాగుకు వినియోగిస్తున్న పంచగవ్య వంటి సేంద్రియ వివరాలను రైతు గోపాలకృష్ణమూర్తిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వినియోగం కారణంగా ప్రజలకు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని, సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల వినియోగం కారణంగా ప్రజలకు ఆరోగ్యంతోపాటు జీవితకాలం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న దానికంటే అదనంగా 10 వేల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయంతో పంటల సాగు లక్ష్యాన్ని ఈ సంవత్సరం సాధించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని చేసే రైతులను ప్రోత్సహిస్తున్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకుని మరింత విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేసిన ధాన్యం, ఉద్యానవన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తున్నదని, వాటికి మరింత మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. అనంతరం పశుగ్రాసం విత్తనాలను కలెక్టర్ అధికారులతో కలిసి పొలంలో చల్లారు.అనంతరం పొలసానిపల్లిలోని ఎస్ ఎం. ఆర్. జీడిపప్పు ప్రాసెసింగ్ సెంటర్ ను కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ వెంట జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాష, డ్వామా పీడీ సుబ్బారావు, ఉద్యానవనాలు శాఖ డిడి రామ్మోహన్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేష్, తహసీల్దార్ సుబ్బారావు, ఎంపిడిఓ ప్రకాష్, ప్రభృతులు పాల్గొన్నారు.
