క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం… రాజ్యసభ మాజీ సభ్యులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఉమ్మడి కర్నూలు జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కిడ్స్ వరల్డ్ లోని కొనిజేటి రోశయ్య కమ్యూనిటీ భవనంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు టైక్వాండో క్రీడ అని, ప్రత్యర్థుల నుండి కాపాడుకునేందుకు ఈ విద్య దోహదపడుతుందన్నారు. దేశాన్ని కాపాడే శక్తి భావి భారత పౌరులైన నేటి బాలల్లో ఉందని, అటువంటివారు ఇలాంటి విద్యను నేర్చుకొని భారత ఖ్యాతిని విస్తరింప చేయాలని తెలియజేశారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించే వారికి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. క్రీడల నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. విద్యార్థులు టైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, అలాగే ప్రత్యర్థుల నుంచి తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొని దేశాన్ని రక్షించే సైనికులుగా ఎదగాలని ఆయన కోరారు. విద్యార్థులు రొటీన్ కోర్సులను కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు త్వరగా లభించే కోర్సులకు ప్రాధాన్యత ఇచ్చి చదువుకోవాలని సూచించారు .ముఖ్యంగా టెక్నికల్ కోర్సులు చదవడం వల్ల ఉద్యోగ అవకాశాలు త్వరగా వస్తాయని చెప్పారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు అందుకు తగిన విధంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ప్రముఖ న్యాయవాది ఎం. శ్రీధర్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జి.శ్రీనివాసులు, కర్నూలు టైక్వాండో ఇంచార్జ్ సతీష్ బాబు తదితరులు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేని దని చెప్పారు. వారి సహకారం నిరంతరం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నంద్యాల ఇంచార్జ్ మాజిత్, టైక్వాండో మాస్టర్స్ వీరేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.