NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుందలో విత్తన దుకాణాలపై వ్యవసాయ అధికారుల తనిఖీలు

1 min read

నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు: అధికారుల హెచ్చరిక

రైతులకు ఎంఆర్పీ ధరలకే నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని ఆదేశాలు

లైసెన్సులు, స్టాక్ రికార్డులు పరిశీలించిన అధికారులు

ప్రతి కొనుగోలుపై రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచన

నష్టపరిహారం కోసం బిల్లు భద్రపరచుకోవాలని రైతులకు అవగాహన

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండలంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్, బిస్మిల్లా ఫెర్టిలైజర్స్, జువారీ ఫార్మ్ హబ్ లిమిటెడ్, ప్రసన్న ఆంజనేయ సీడ్స్ విత్తనాల దుకాణాలను అలూరు వ్యవసాయ సహాయ సంచాలకులు (ADA) ఎం. చెంగళరాయుడు  మరియు మండల వ్యవసాయ అధికారి  ఆనంద్ లోకదళ్  సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు ఆయా దుకాణాల్లో విత్తనాల లైసెన్సులు, అనుమతి పత్రాలు, స్టాక్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.రైతులకు నాణ్యమైన విత్తనాలను కేవలం ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా లేదా నకిలీ/అనుమతి లేని విత్తనాలు విక్రయించినా సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.అదేవిధంగా, రైతులు కొనుగోలు చేసే ప్రతి విత్తనం, ఎరువు, పురుగు మందులపై తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని డీలర్లకు సూచించారు.రైతులు కూడా అనుమతి పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. పంట కాలం పూర్తయ్యే వరకు ఆ బిల్లులను భద్రపరచుకోవాలని సూచించారు.విత్తన మొలకలో సమస్యలు లేదా పంట ఎదుగుదలలో లోపాలు తలెత్తినప్పుడు విత్తన తయారీ సంస్థల నుండి నష్టపరిహారం పొందాలంటే కొనుగోలు బిల్లు తప్పనిసరిగా అవసరమని వివరించారు.గ్రామాల్లో ఎవరైనా నకిలీ లేదా లూజు విత్తనాలు విక్రయిస్తున్నట్లు గమనించినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.

About Author