ఏలూరుజిల్లాలో గంజాయి విక్రయ ముఠా అరెస్ట్
1 min read
ఐదుగురు పట్టివేత 650 గ్రాముల గంజాయి స్వాధీనం
కేసులో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించి, రివార్డులకు సిఫార్సు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరంలో గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్న ముఠాను టూ టౌన్ పోలీసులు పట్టుకుని ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఏలూరు డి.ఎస్.పి శ్రావణ్ కుమార్ బుధవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు Cr.No:112/2026గా కేసు నమోదు చేసి కీలకమైన దర్యాప్తును కొనసాగిస్తున్నామన్నరు. పోలీసుల వివరాల ప్రకారం కుమ్మరి రేవు 2వ రోడ్డుకు చెందిన దొడ్డి రామ నాగేశ్వరరావు, కర్రీ సత్యనారాయణలకు గంజాయి సేవించే అలవాటు ఉంది. ఇటీవల గంజాయి విక్రయాలు, వినియోగంపై పోలీసు నిఘా పెరగడంతో స్థానికంగా గంజాయి దొరకడం కష్టమైంది. దీంతో దొడ్డి రామ నాగేశ్వరరావు స్వయంగా సీలేరు ప్రాంతానికి వెళ్లి రూ.14 వేలతో రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేసి ఏలూరుకు తీసుకొచ్చాడు.తర్వాత గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. అశోక్ కుమార్ ఆదేశాలపై ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి దొడ్డి రామ నాగేశ్వరరావు నివాసంలో దాడి నిర్వహించగా దొడ్డి రామ నాగేశ్వరరావు, కర్రీ సత్యనారాయణతో పాటు గౌతు శేషు, బంగారు దుర్గాప్రసాద్, చందాని పృధ్వీరాజులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి 650 గ్రాముల గంజాయి, రూ.300 నగదు, గంజాయి సేవించేందుకు ఉపయోగించిన మూడు ప్లాస్టిక్ కూల్డ్రింక్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ దుర్గారావు, హోంగార్డు పి.శ్రీనివాస్లను అధికారులు అభినందించి రివార్డులకు సిఫార్సు చేశారు.

