వీఆర్వో హుస్సేన్ మృతి పట్ల సంతాపం – పని ఒత్తిడి తగ్గించాలని వీఆర్వోల నిరసన
1 min read
హొళగుంద న్యూస్ నేడు: కర్నూలు నగరంలో విధుల నిర్వహణలో అధిక పని ఒత్తిడి కారణంగా వీఆర్వో శ్రీ హుస్సేన్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన పట్ల హొళగుంద మండల వీఆర్వోలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మరణించిన హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ హొళగుంద తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వీఆర్వోలు మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వీఆర్వోలపై రోజురోజుకూ పెరుగుతున్న పని భారం, మానసిక ఒత్తిడి కారణంగా ఇలాంటి విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వీఆర్వోలపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించే చర్యలు చేపట్టాలని, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో మండలంలోని వీఆర్వోలు పాల్గొని హుస్సేన్ కి నివాళులర్పించారు.


