నేషనల్ లోక్ అదాలత్లో 600 మందికి ఉచిత భోజనం
1 min read
డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, కైపా పద్మలత రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
కర్నూలు,న్యూస్ నేడు: నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో శనివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. విచారణల కోసం కోర్టుకు వచ్చిన ఫిర్యాదుదారులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, ఇతర ఉద్యోగులు, ప్రజలకు సుమారు 600 మందికి ఉచిత భోజనం అందించారు.ఈ కార్యక్రమాన్ని విద్యాసంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాప్తాడు పరిశీలకురాలు కైపా పద్మలత రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. లోక్ అదాలత్కు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో, కోర్టు ఆవరణలోనే భోజన ఏర్పాట్లు చేసి వారికి ఆతిథ్యం అందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. న్యాయ సేవల కోసం కోర్టుకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా భోజన సౌకర్యం కల్పించామని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని చాటుతాయని పేర్కొన్నారు.భోజన ఏర్పాట్లను కోర్టుకు వచ్చిన ప్రజలు, న్యాయవాదులు, ఉద్యోగులు అభినందించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

