నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాల అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలి
1 min read
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాలలు సమర్థవంతంగా పనిచేసేలా అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి వైద్య అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రయోగశాల అభివృద్ధి సంఘం సమావేశం కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ప్రయోగశాల సేవలు నిరంతరాయంగా అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని, సిబ్బంది కొరతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సేవల్లో అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రయోగశాలల్లో సిబ్బంది కొరత, బడ్జెట్ పరిమితులు, నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికీ తీసుకొని రాగా, సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలతో కూడిన సమగ్ర నోట్ ఫైల్ను సిద్ధం చేయాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్.ఓ. వాటర్ ప్లాంట్లు, వ్యక్తిగత గృహాలు తదితరుల నుంచి తాగునీటి నాణ్యత పరీక్షలకు వసూలు చేస్తున్న 380 రూపాయల ఫీజు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదని, ప్రయోగశాలల నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని టెస్టింగ్ ఫీజు పెంపునకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రస్తుతం రీజినల్ ఫుడ్ ల్యాబ్ను స్టేట్ ఫుడ్ ల్యాబ్గా అప్గ్రేడ్ చేశారని, ఏపీఎంఎస్ఐడీసీ (APMSIDC)కు పరిపాలనా అనుమతులు, లిఖితపూర్వక ఆదేశాలు పూర్తిగా అందకపోవడంతో పనుల్లో జాప్యం ఏర్పడిందని, ఈ ప్రయోగశాలలో ఆహార భద్రతతో పాటు నీటి నాణ్యత పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు వైద్యులు కలెక్టర్ కు వివరించారు.. ఈ ప్రాజెక్టుకు 2024లో రూ.19 కోట్ల నిధులు మంజూరయ్యాయని, స్టేట్ ఫుడ్ ల్యాబ్ పనులు త్వరితగతిన పూర్తయితే అదనపు సిబ్బంది, అవసరమైన నిధులు అందుబాటులోకి వచ్చి ప్రస్తుతం ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వైద్య అధికారులు కలెక్టర్ కు తెలిపారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసేందుకు నోట్ ఫైల్ సిద్ధం చేసి పంపాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియాలజిస్ట్ డా. ఓ. ప్రభావతి దేవి, సభ్యులు డా.గోవింద రెడ్డి, ఎస్.మురళి (జూనియర్ అనలిస్టు), శారద, అనంత రాజేంద్ర ప్రసాద్, డా.రమేష్ కుమార్, డా.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


