వృద్ధుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా అత్యాధునికి స్టెంట్
1 min read
గుండెపోటు రోగులకు నూతన జీవితం
అనంతపురం, న్యూస్ నేడు : తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిన 67 ఏళ్ల రోగికి అత్యంత క్లిష్టమైన గుండె రక్తనాళాల సమస్యను అత్యాధునిక స్టెంటింగ్ విధానంతో విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు కిమ్స్ సవీర వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చికిత్సనందించిన కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డా. స్పందన. అనంతపురం జిల్లాకు చెందిన దూదేకుల దస్తగిరి (67) తీవ్రమైన గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఇక్కడ చేసిన కరోనరీ యాంజియోగ్రామ్ లో గుండె ప్రధాన రక్తనాళమైన లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీతో పాటు మూడు ప్రధాన గుండె రక్తనాళాల్లో తీవ్ర అడ్డంకులు (ట్రిపుల్ వెసెల్ డిసీజ్) ఉన్నట్లు గుర్తించాం. దీంతో రోగికి కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (సీఏబిజి) శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. కాగా వ్యక్తిగత కారణాలతో రోగి శస్త్రచికిత్సకు అంగీకరించకపోవడంతో, ప్రత్యామ్నాయంగా అత్యాధునిక ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ (ఓసిటి) మార్గదర్శకత్వంలో లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ స్టెంటింగ్ వేశాం. అత్యంత క్లిష్టమైన ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ప్రక్రియ విజయవంతంగా చేశాం. చికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఫాలోఅప్లో రోగి ఆరోగ్యంగా ఉన్నారు. అంతేకాకుండా తన దైనందినత పనులను తనే స్వయంగా చేసుకోగలుగుతున్నారు. గుండె ప్రధాన రక్తనాళంలో ఏర్పడే అడ్డంకులు అత్యంత ప్రమాదకరమైనవని, అయితే ఆధునిక ఇమేజింగ్ సాంకేతికతలైన ఓసిటి సహాయంతో క్లిష్టమైన స్టెంటింగ్ విధానాలను మరింత ఖచ్చితత్వంతో, సురక్షితంగా నిర్వహించవచ్చన్నారు. గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని సూచించారు. విజయవంతంగా చికిత్స అందించిన వైద్య బృందానికి రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలిపారు.


