శాస్త్రవేత్తల బృందం రైతులకు పంటల యాజమాన్యంపై అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆచార్య ఎన్ .జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నియమించిన ఎల్ నినో కాంబాట్ శాస్త్రవేత్తల బృందం కల్లూరు మండలంలో రైతులకు పంటల యాజమాన్యంపై అవగాహన:: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నియమించిన ఎల్నినో కంబాట్ శాస్త్రవేత్తల బృందం ఈ రోజు కర్నూలు జిల్లా, కల్లూరు మండలంలోని పూసులూరు, బొల్లవరం బస్తిపాడు, ఉలిందకొండ మరియు ఇతర గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమైంది.ఈ బృందంలో జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా మరియు శిక్షణ కేంద్రం (ఏరువాక కేంద్రం), కర్నూలు ప్రధాన శాస్త్రవేత్త డా . పి. సుజాతమ్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.మౌనిక మరియు మండల వ్యవసాయ అధికారి డి.విష్ణు వర్ధన్ రెడ్డి, వివిధ రైతు సేవ కేంద్రాల సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నిరాశ చెందకుండా ధైర్యంగా ఎల్నినో పరిస్థితులను ఎదుర్కోవాలని సూచించారు. తక్కువ నీటి అవసరం ఉండే, స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలని, అంతరపంటలు సాగు చేయడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు.ప్రత్యామ్నాయంగా కొర్ర, పెసర, అలసంద, సజ్జ వంటి పంటలను సాగు చేయాలని, పొలాలను ఖాళీగా ఉంచకుండా అందుబాటులో ఉన్న తేమను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇప్పటికే సాగులో ఉన్న పంటల్లో తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలని, కలుపు మొక్కల నివారణ, అంతర దుక్కులు, మల్చింగ్ వంటి పద్ధతులను పాటించాలని తెలిపారు. అలాగే బెట్ట పరిస్థితుల నుంచి పంటలను కాపాడేందుకు 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ ఎరువులలో ఏదో ఒకదానిని లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి ఆకులపై పిచికారీ చేయాలని సూచించారు.అదేవిధంగా రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటించాలని, అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు వాడాలని, అలాగే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలని, అలాగే ప్రస్తుతం ఉన్న ప్రత్తి మరియు కంది పంటలలో గమనించిన పురుగులు మరియు తెగుళ్ల పై రైతులకు యాజమాన్య పద్ధతులను వివరించారు.తెగుళ్ల మందులను విచక్షణారహితంగా అధిక మోతాదులో ఉపయోగించి సాగు ఖర్చును పెంచుకోవద్దని సూచించారు. పంటలను నిరంతరం పరిశీలిస్తూ సమస్యలు తలెత్తిన వెంటనే సమీప ఆచార్య ఎన్. జి రంగ వ్యవసాయ శాస్త్రవేత్తలను మరియు వ్యవసాయ అధికారులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.


