సీబీఎస్ఈ సౌత్ జోన్ తైక్వాండో పోటీలలో రిడ్జ్ విద్యార్థుల ప్రతిభ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాల విద్యార్థులు సీబీఎస్ఈ సౌత్ జోన్ తైక్వాండో పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు, కర్నూలు జిల్లాకు విశేష కీర్తి తీసుకొచ్చారు.ఆగస్టు 4 నుండి 8 వరకు హైదరాబాద్లోని ఆరిజిన్ స్కూల్ వేదికగా నిర్వహించిన సీబీఎస్ఈ సౌత్ జోన్ తైక్వాండో పోటీలలో రిడ్జ్ పాఠశాలకు చెందిన డి. శివ విఘ్నేష్ రెడ్డి (సిల్వర్ మెడల్), షెర్లిన్ సంజీవ్ (బ్రాంజ్ మెడల్) సాధించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. వీరి విజయంపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో సీఈఓ జి. గోపీనాథ్ మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన ఈ విజయం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, పట్టుదలతో సాధన చేయడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ విజయం రిడ్జ్ పాఠశాలకే కాకుండా కర్నూలు జిల్లాకు కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చిందని తెలిపారు.కో-సీఈఓ సౌమ్య గోపీనాథ్ మాట్లాడుతూ, తైక్వాండో వంటి క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు.విద్యార్థులను ఈ స్థాయికి తీర్చిదిద్దిన తైక్వాండో మాస్టర్ జి. సుందర్ రాజు ని పాఠశాల యాజమాన్యం వారు ప్రత్యేకంగా అభినందించారు ఆయన మార్గదర్శకత్వంలో విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీన్ పి.కె. రాజేంద్రన్ , ప్రిన్సిపల్ ఏ. రాజ్కమల్ , హెచ్ఓడీలు ఏ. నాగేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొని విజేత విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్ఠాత్మక విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.


