పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటాం
1 min read
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరిక
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు అర్జీదారుల వద్దకు వెళ్లి అర్జీ అందినట్టు రసీదు అందించి, సక్రమ విచారణ చేయాలన్నారు. అర్జీదారుడిని కలిసినట్టు ఫోటో ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. కానీ కొందరు అధికారులు అర్జీదారులను కలవకుండా తమవద్దకు పిలిపించుకుంటున్నారని, అర్జీలను సక్రమంగా విచారణ చేయకుండా పరిష్కారం చూపుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కార్యాలయంనకు ప్రజలు అందించిన పిజిఆర్ఎస్ అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)- 2026 లో ముసాయిదా జాబితాలో క్లెయిమ్లు మరియు అభ్యంతరాలకు సంబంధించి అర్జీదారులకు నోటీసులు అందించాలని, నోటీసులపై నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఫారం -6, 7, 8 లపై అందిన దరఖాస్తులను పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఎస్డిసి దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ. భానుప్రతాప్,స్వర్ణ గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రత్యేక అధికారి నాయుడు,వివిధ శాఖల అధికారులు, ఈఆర్ఓ లు,ఏఈఆర్ఓ లు, తహసీల్దార్లు,ఎంపిడిఓలు, బిఎల్ఓ లు,ప్రభృతులు పాల్గొన్నారు.


