పరిశ్రమల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
1 min read
సెప్టెంబర్ నెలాఖరులోపు ఆఫ్సైట్ మాక్ డ్రిల్ నిర్వహించాలి
ప్రమాదాల నివారణకు కార్మికులకు భద్రతా శిక్షణ తప్పనిసరి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత అధికారులను, ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో పరిశ్రమల భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణ, మాక్ డ్రిల్స్ నిర్వహణ తదితర అంశాలపై జిల్లా క్రైసిస్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఫ్యాక్టరీ యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలను ఫ్యాక్టరీస్ శాఖ అధికారులు క్రమం తప్పకుండా పరిశీలించి ధ్రువీకరించాలని తెలిపారు. జిల్లాలో సెప్టెంబర్ నెలాఖరులోపు ఆఫ్సైట్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా క్రైసిస్ కమిటీ సమావేశాలు, మాక్ డ్రిల్స్ను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ప్రమాదకర పరిశ్రమల నుంచి ఆన్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్స్ను సేకరించినట్లు సమావేశంలో చర్చించారు. ఆయా పరిశ్రమలు తమ అత్యవసర ప్రణాళికలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక భద్రత, అత్యవసర పరిస్థితుల సమర్థవంతమైన నిర్వహణకు అన్ని సంబంధిత శాఖలు, పరిశ్రమల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.ఫ్యాక్టరీల విభాగం డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ నారాయణ రెడ్డి జిల్లాలో ఉన్న కర్మాగారాల పరిస్థితి గురించి వివరించారు.సమావేశంలో కర్నూల్ ఆర్డిఓ సందీప్ కుమార్, డిఎంహెచ్వో డాక్టర్ కామేశ్వర ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి , జిల్లా రవాణాశాఖ అధికారి శాంతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి కిషోర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుర్రప్ప యాదవ్, తదితరులు పాల్గొన్నారు.



