శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో గోమాతకు ఘనంగా పూజలు
1 min read
గోసేవయే గోవిందుడి సేవ — ధార్మిక చైతన్యానికి గోపూజ దోహదం
కర్నూలు, న్యూస్ నేడు: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగర శివారులో వెలసిన శ్రీగోదాగోకులం నందు గోపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గోమాతను ప్రత్యేకంగా అలంకరించి, పసుపు, కుంకుమలతో పూజించి, వస్త్రం, పుష్పమాలలు సమర్పించారు. తిరునగరి రమేషాచార్యులు, వేదపండితులు వరయూరు కిరణ్ కుమారాచార్యులు, లక్ష్మీనారాయణాచార్యులు, మహేషాచార్యులు, పద్మనారాయణలు వేదమంత్రోచ్ఛారణల మధ్య గోమాతకు హారతి ఇచ్చి, భక్తులతో గోప్రదక్షిణలు నిర్వహింపచేశారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ, భారతీయ సనాతన ధర్మంలో గోవుకు అత్యంత విశిష్టమైన స్థానం ఉన్నదని తెలిపారు. శ్రీకృష్ణుడు గోపాలుడిగా గోవులతో అనుబంధాన్ని కలిగి ఉన్నందున శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గోపూజ నిర్వహించడం ఎంతో పవిత్రమైన కార్యక్రమమని పేర్కొన్నారు. గోసేవ, గోపూజ ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల భక్తిభావం పెంపొందడంతో పాటు, ధార్మిక చైతన్యం మరియు సేవాభావం ప్రజల్లో మరింతగా వికసిస్తాయని తెలిపారు. నేటి తరానికి సనాతన ధర్మంలోని విలువలను తెలియజేయడం, ఆచార వ్యవహారాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక చైతన్యం, భక్తి, సత్సంగాలు, భజనలు, పూజా కార్యక్రమాలు మరియు సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, ట్రష్టీ పల్లెర్ల నాగరాజు, తుమ్మేపల్లి శ్రీనివాసరావు, పాలాది సుబ్రహ్మణ్యం, వేముల జనార్దన్, పెరుమాళ్ళ బాలసుధాకర్, భూమా కృష్ణ మోహన్, లింగం రవి, లింగం కృష్ణయ్యశ్రేష్ఠి, తల్లం సురేష్, మాకం శ్రీనివాస్, నూకల గిరిబాబు, జి. రాధాకృష్ణ, ఇ. పుల్లయ్య పెద్ద సంఖ్యలో గోదాపరివార్ మహిళలు, భక్తులు పాల్గొని గోమాత ఆశీస్సులు పొందారు. కుంకుమార్చన, ఊంజల్ సేవ, పల్లకి సేవ, ఉట్టికొట్టేకార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల బాలకృష్ణుల వేషధారణలు భక్తులను ముచ్చట గొలిపాయి. గోపూజ అనంతరం భక్తులందరికీ మహా ప్రసాద వితరణ చేశారు.


