101 బిందెల నీటితో శ్రీ పేట బసవేశ్వర స్వామికి అభిషేకం
1 min read
సకాలంలో వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు
హోళగుందన్యూస్ నేడు: మండల కేంద్రంలో శ్రీ పేట బసవేశ్వర స్వామికి వరుణ దేవుని కటాక్షం కోసం గురువారం రాత్రి 101 బిందెల నీటితో ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా భక్తులు భజనలతో పెద్ద బావి వద్దకు చేరుకుని గంగామాతకు విశేష పూజలు సమర్పించారు. అనంతరం రాత్రంతా భజనలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకున్నారు.శుక్రవారం వేకువజామున శ్రీ పేట బసవేశ్వర స్వామికి జలాభిషేకం, గంధాభిషేకం, రుద్రాభిషేకం, ఆకుపూజ తదితర విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పెద్ద ఎత్తున పూలమాలలతో సుందరంగా అలంకరించారు.ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ లోకక్షేమం, సకాలంలో వర్షాలు కురవడం, రైతులకు పంటలు సమృద్ధిగా పండడం, ప్రజలు సుఖసంతోషాలతో జీవించడం కోసం స్వామివారికి 101 బిందెల నీటితో ప్రత్యేక అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సమస్త వీరశైవ బంధు బాంధవులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


