వినాయక నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
1 min read
హంద్రీనీవాలో 3 ప్రాంతాల్లో నిమజ్జనానికి అవకాశాలు: మంత్రి టీజీ భరత్
ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు వివరించిన మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: హంద్రీనీవాలో వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సుంకేసులలో నీటి లభ్యత లేని కారణంంగా కె.సి కెనాల్కు నీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని ఆయన తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 2వ తేదీన అధికారులు నిర్వహించిన సమీక్షలో ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే హంద్రీనీవాకు నీరు తీసుకునేందుకు వీలుంటుందని చెప్పారన్నారు. అప్పుడు కూడా చిన్న విగ్రహాలు మాత్రమే హంద్రీనీవాలో నిమజ్జనం చేసుకునేందుకు వీలుంటుందని చెప్పారన్నారు. తాజాగా జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశం తర్వాత.. ఇప్పటి నుండి మరో 12 లేదా 14 రోజుల వరకు హంద్రీనీవాకు నీటిని తీసుకునేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. దీంతో పాటు పెద్ద విగ్రహాలు సైతం నిమజ్జనం చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. హంద్రీనీవాలో మూడు రోజుల పాటు అంటే వినాయకుడిని ప్రతిష్టించిన తర్వాత 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు నిమజ్జనం చేసుకునేందుకు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందులో ప్రధానంగా 5వ రోజు, 7వ రోజు నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని.. నిమజ్జనం చేయడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని తెలిపారన్నారు. 9వ రోజు నిమజ్జనానికి ఎంతమేర అనుకూలత ఉంటుందో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా అంచనా వేయలేమన్నారు. నిమజ్జనం చేసేందుకు నన్నూర్ టోల్గేట్, తడకనపల్లె, ఉలిందకొండ వద్ద హంద్రీనీవాలో ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతాన్ని వినాయక నిమజ్జన కమిటీ వారు ఎంపిక చేసి చెబితే.. గత కొన్ని సంవత్సరాలుగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తరుపున నిమజ్జన సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో అదేవిధంగా ఈ ఏడాది కూడా నిమజ్జన కమిటీ ఎంపిక చేసిన ప్రాంతంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తరుపున పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తామన్నారు.ప్రజలు ఒక అడుగు లేదా అడుగున్నర మట్టి విగ్రహాలు మాత్రమే ఏర్పాటుచేసుకోవాలని ఆయన సూచించారు. చిన్న విగ్రహాలైతే ఇంటి వద్దనే నిమజ్జనం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. పెద్ద విగ్రహాల నిమజ్జనం కోసం వినాయక నిమజ్జన కమిటీ, అధికారులు ఎంపిక చేసిన ప్రాంతంలో నిమజ్జనం చేస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇక వర్షాలు కురిసేందుకు దేవాదాయ శాఖ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా వరుణ యాగం చేయాలని క్యాబినెట్ సమావేశంలో చర్చించామని, కర్నూలులో గాయత్రి గోసేవ సమితి ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహిస్తామన్నారు. వర్షాలు కురిసి సుంకేసులకు నీరు వస్తే కెసి కెనాల్కు నీరు వస్తుందన్నారు. అప్పుడు అక్కడ నిమజ్జనం చేసుకోవచ్చన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కె.సి కెనాల్లో నిమజ్జనం చేసేందుకు అవకాశం లేదన్నని అర్థం చేసుకొని సహకరించాలని ఆయన ప్రజలను కోరాను.


